ఎస్బీఐ 444 రోజుల ఎఫ్డీపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు! రూ.2.5 లక్షల పెట్టుబడిపై రూ.22 వేల వరకు వడ్డీ
ఎస్బీఐ అమృత్ వర్ష 444 రోజుల ఎఫ్డీ పథకంలో రూ.2.5 లక్షలు పెట్టుబడి పెడితే సాధారణ పౌరుల నుంచి సూపర్ సీనియర్ సిటిజన్ల వరకు ఆకర్షణీయమైన వడ్డీ లాభాలు లభిస్తున్నాయి.

పెట్టుబడుల విషయంలో ఇప్పటికీ చాలా మంది భారతీయులు ఫిక్స్డ్ డిపాజిట్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, మ్యూచువల్ ఫండ్ రిస్క్లకు దూరంగా ఉండాలనుకునే వారికి ఎఫ్డీలు సురక్షితమైన మార్గంగా మారాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఎఫ్డీ పథకాన్ని అందిస్తోంది.
ఎస్బీఐ ప్రస్తుతం వివిధ కాలపరిమితుల ఎఫ్డీలపై 3.05 శాతం నుంచి 7.15 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది. ముఖ్యంగా 444 రోజుల ‘అమృత్ వర్ష’ స్కీమ్ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పథకంలో సాధారణ పౌరులకు 6.45 శాతం వడ్డీ అందుతోంది.
ఒకవేళ సాధారణ కస్టమర్ రూ.2,50,000ను 444 రోజుల పాటు ఈ ఎఫ్డీలో పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.20,235 వడ్డీ లభిస్తుంది. దీంతో మొత్తం రూ.2,70,235 చేతికి వస్తుంది.
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ మరింత ఎక్కువ వడ్డీ ప్రయోజనం కల్పిస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారు ఇదే మొత్తాన్ని డిపాజిట్ చేస్తే వారికి సుమారు రూ.21,858 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.2,71,858 అందుతుంది.
అలాగే 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు అత్యధిక ప్రయోజనం ఉంటుంది. రూ.2.5 లక్షల పెట్టుబడిపై వారికి సుమారు రూ.22,183 వడ్డీ లభించనుంది. దీంతో మొత్తం రూ.2,72,183 వరకు రాబడి పొందవచ్చు.
ఎస్బీఐలో కనీసం 7 రోజుల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఎఫ్డీ ఖాతాలు తెరవడానికి అవకాశం ఉంది. పెట్టుబడిదారుల అవసరాలను బట్టి స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టవచ్చు.
రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఎస్బీఐ అమృత్ వర్ష ఎఫ్డీ మంచి ఎంపికగా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

